కోటక్‌ లాభం 2,407 కోట్లు

23 Oct, 2019 04:47 IST|Sakshi

క్యూ2లో 51% అప్‌..; ఆదాయం రూ.12,543 కోట్లు

25% పెరిగిన నికర వడ్డీ ఆదాయం

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.2,407 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం(రూ.1,747 కోట్లు)తో పోల్చితే 38 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,829 కోట్ల నుంచి రూ.12,543 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో రూ.1,142 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 51 శాతం వృద్ధితో రూ.1,724 కోట్లకు పెరిగిందని వివరించింది.

రూ.3,350 కోట్లకు నికర వడ్డీ ఆదాయం.... 
పన్ను వ్యయాలు తక్కువగా ఉండటం,  నికర వడ్డీ ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తెలిపింది. తమ కన్సాలిడేటెట్‌ లాభంతో అనుబంధ సంస్థల వాటా 28 శాతంగా ఉందని వివరించింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,676 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.3,350 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ2లో 4.19 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ2లో 4.61 శాతానికి పెరిగిందని పేర్కొంది. రుణ వృద్ధి 21 శాతం నుంచి 15 శాతానికి తగ్గిందని తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఈ క్యూ1లో రుణ వృద్ధి 18 శాతమని పేర్కొంది.

తగ్గిన రుణ నాణ్యత... 
ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ2లో రూ.4,302 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.5,475 కోట్లకు పెరిగాయని బ్యాంక్‌ పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు రూ.1,618 కోట్ల నుంచి రూ.2,032 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 1.91 శాతం నుంచి 2.17 శాతానికి, నికర మొండి బకాయిలు 0.73 శాతం నుంచి 0.82 శాతానికి పెరిగాయని పేర్కొంది. కేటాయింపులు రూ.360 కోట్ల నుంచి రూ.473 కోట్లకు పెరిగాయని వివరించింది.

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 0.8 శాతం లాభంతో రూ.1,629 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు