పీఎన్‌బీ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌: మూడీస్‌

22 May, 2018 00:38 IST|Sakshi

ముంబై: కుంభకోణం, భారీ నష్టాలతో సతమతమవుతున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రేటింగ్‌ను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. లాభదాయకతపై తీవ్ర ప్రతికూల ప్రభావాల కారణంగా బీఏ/ఎన్‌పీ రేటింగ్‌ నుంచి బీఏఏ3/పీ–3కి డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు పేర్కొంది. ఇతరత్రా వనరుల మద్దతు లేకుండా నిలదొక్కుకోగలిగే సామర్థ్యానికి సంబంధించిన బేస్‌లైన్‌ క్రెడిట్‌ అసెస్‌మెంట్‌ను (బీసీఏ) కూడా తగ్గించింది.

అయితే, అవుట్‌లుక్‌ మాత్రం స్థిరంగానే కొనసాగిస్తున్నట్లు మూడీస్‌ పేర్కొంది.  వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి బాసెల్‌ నిబంధనలకు తగ్గట్లుగా కనీస మూలధనం ఉండాలన్నా... పీఎన్‌బీ బయటి నుంచి సుమారు రూ. 12,000–13,000 కోట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం నుంచి కొంత మొత్తం లభించడంతో పాటు ఇతరత్రా రియల్టీ ఆస్తులు, అనుబంధ సంస్థ పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో పాక్షికంగా వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నా.. స్కామ్‌ బైటపడక పూర్వం ఉన్న స్థాయికి మూలధనం పెరగకపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.


 

మరిన్ని వార్తలు