కొత్త కస్టమర్లు ఎయిర్‌టెల్‌ వైపు..

24 Oct, 2017 03:33 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌ను దిగ్గజ టెలికం కంపెనీ అని ఎందుకు పిలుస్తారో మరొకసారి రుజువైంది. సెప్టెంబర్‌ నెలలో ఎయిర్‌టెల్‌కు మాత్రమే కొత్తగా యూజర్లు జతయ్యారు. సీవోఏఐ ప్రకారం.. ఎయిర్‌టెల్‌ యూజర్ల సంఖ్య కొత్తగా 10 లక్షలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌సెల్, టెలినార్‌ సంస్థలు మొత్తంగా 29 లక్షలకుపైగా యూజర్లను కోల్పోయాయి.

టెలినార్‌ కస్టమర్ల సంఖ్య ఏకంగా 9.37 లక్షలమేర తగ్గింది. అయితే టెలినార్‌ – ఎయిర్‌టెల్‌ విలీనం ఇప్పటికే దాదాపు ఖరారవటం ఈ సందర్భంగా గమనార్హం. ఐడియా 9.04 లక్షలమేర, వొడాఫోన్‌ 7 లక్షలమేర, ఎయిర్‌సెల్‌ 3.94 లక్షలమేర సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి.

సెప్టెంబర్‌ చివరి నాటికి చూస్తే.. భారతీ ఎయిర్‌టెల్‌ 29.8 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని మొత్తం యూజర్ల సంఖ్య 28.2 కోట్లుగా ఉంది. దీని తర్వాతి స్థానంలో వొడాఫోన్‌ (20.74 కోట్లు), ఐడియా (19 కోట్లు) ఉన్నాయి. కాగా రిలయన్స్‌ జియో, టాటా టెలీసర్వీసెస్, ఆర్‌కామ్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సీవోఏఐ ప్రకటించలేదు. 

మరిన్ని వార్తలు