న్యూఢిల్లీ: పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)కు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి తల్లే సింగిల్ పేరెంట్ అయితే, సంబంధిత వ్యక్తి పాన్ దరఖాస్తులో తండ్రిపేరు అక్కర్లేదు. ఆదాయపు పన్ను నిబంధనలను సవరిస్తూ, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) ఈ మేరకు మంగళవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
సవరణలకు అనుగుణంగా దరఖాస్తులో మార్పూ ఉంటుంది. దరఖాస్తుదారుడు తల్లిపేరు మాత్రమే సమర్పించడానికి ఈ తాజా దరఖాస్తు వీలు కల్పిస్తుంది. తాజా నిబంధన డిసెంబర్ 5వ తేదీ నుంచీ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం పాన్ జారీకి తండ్రి పేరు సమర్పించడం తప్పనిసరి. కొన్ని వర్గాల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజా మార్పులు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వార్షికంగా రూ.2.5 లక్షలు ఆపైన ఆర్థిక లావాదేవీలు కలిగినవారు తప్పనిసరిగా పాన్ కార్డ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.