Pooja Hegde: టాలీవుడ్‌లో ఒక్క సినిమా లేదు.. బుట్టబొమ్మకు లక్కీ ఛాన్స్‌!

23 Dec, 2023 10:05 IST|Sakshi

హీరోయిన్‌ పూజా హెగ్డే నిజంగా లక్కీ హీరోయిన్‌ అని చెప్పక తప్పదు. దశాబ్దం క్రితం ముఖముడి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైందీ బ్యూటీ. ఆ చిత్రం సరిగ్గా ఆడకపోవడంతో  అక్కడ ఎవరు పట్టించుకోలేదు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను అక్కున చేర్చుకుంది. ఇక్కడ ఆమె నటించిన మహర్షి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది.

కష్టకాలంలో ఉన్న పూజాకు లక్కీ ఛాన్స్‌
ఎంతగా అంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా లేనంతగా! ఇటీవలి కాలంలో ఆమె నటించిన తమిళం, హిందీ చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పూజా హెగ్డేకు కోలీవుడ్‌ మరో లక్కీ చాన్స్‌ ఇవ్వబోతోందన్నది తాజా సమాచారం. భారతీయ సినీ చరిత్రలో ఏవీఎం చిత్ర నిర్మాణ సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు పలువురు స్టార్స్‌తో తమిళం, తెలుగు, హిందీ వంటి పలు భాషల్లో చిత్రాలు నిర్మించి ఎన్నో విజయాలను సాధించింది. ఈ సంస్థలో చిత్రాలు చేయడానికి నటీనటులు, దర్శకులు, సాంకేతిక వర్గం కలలు కంటుంటారు. అలాంటి ఈ సంస్థ ఇటీవలి కాలంలో చిత్ర నిర్మాణానికి దూరంగా ఉంటూ వచ్చింది.

లేడీ ఓరియంటెడ్‌ మూవీలో..
తాజాగా మళ్లీ చిత్ర నిర్మాణం చేపట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సంస్థ ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోసం సినిమా నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి డిమాంటి కాలనీ, ఇమైకా నొడిగల్‌ చిత్రాల దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇది లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రంగా ఉంటుందని, ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

చదవండి: పేరు మార్చుకున్న 'బిగ్‌ బాస్‌' విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌.. అండగా నిలబడిన భోలే

>
మరిన్ని వార్తలు