డిసెంబర్‌ 31 తర్వాత ఆ కార్డులు చెల్లవు

21 Sep, 2018 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు అప్‌గ్రేడ్‌ కావాలని బ్యాంకులు పంపుతున్న మెసేజ్‌లను పట్టించుకోకుంటే ఖాతాదారులకు కష్టాలు తప్పవు. డిసెంబర్‌ 31 తర్వాత పాత డెబిట్‌ కార్డులు చెల్లవని ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా పాత డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల స్ధానంలో చిప్‌ ఆధారిత కార్డులు పొందాలని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను హ్యాక్‌ చేయడం, క్లోనింగ్‌ ద్వారా ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంతో వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ చిప్‌ ఆధారిత కార్డులను ప్రవేశపెట్టాలని బ్యాంకులను ఆదేశించింది.

ప్రస్తుతం వాడుతున్న మాగ్నెటిక్‌​ స్ర్టిప్‌ కార్డుల స్ధానంలో ఈఎంవి చిప్‌ ఆధారిత కార్డులు పొందాలని ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కస్టమర్లను కోరుతున్నాయి. ఈఎంవి చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జనవరి 2016 నుంచి వినియోగంలో ఉన్నాయి. 2016 జనవరి 31 తర్వాత కొత్తగా ఖాతాలు తెరిచే కస్టమర్లకు చిప్‌ ఆధారిత కార్డులే అందించాలని ఆర్‌బీఐ బ్యాంకులు విస్పష్టంగా సూచించింది. మాగ్నెటిక్‌ స్ర్టిప్‌ కార్డులతో పోలిస్తే ఈఎంవి చిప్‌ ఆధారిత డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు పూర్తి భద్రతతో కూడుకున్నవి.

మరిన్ని వార్తలు