విమాన ప్రయాణికులకు ఊరట!!

23 May, 2018 00:30 IST|Sakshi

24 గంటల్లోగా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే చార్జీలు రద్దు

పౌర విమానయాన శాఖ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు, మరిన్ని సదుపాయాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు తెరపైకి తె చ్చింది. ప్రయాణికులకు ఊరటనిచ్చేలా.. దేశీయం గా ప్రయాణాల కోసం ఉద్దేశించిన టికెట్లను బుక్‌ చేసుకున్న 24 గంటల్లోగా క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి చార్జీలు విధించకూడదని ప్రతిపాదించింది. 24 గంటల లాకిన్‌ వ్యవధిలో ప్యాసింజర్ల పేర్లలో మార్పు లు .. చేర్పులు, ప్రయాణ తేదీలను సవరించుకోవడం మొదలైనవి ఉచితంగా చేసుకోవచ్చని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు.

విమానం బైల్దేరడానికి నాలుగు రోజుల ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవు. విమాన ప్రయాణికుల హక్కుల పరిరక్షణ, సదుపాయాల కల్పనకు సంబంధించిన ముసాయిదా చార్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. ‘టికెట్‌ను బుక్‌ చేసుకున్న 24 గంటల్లోగా ఎలాంటి చార్జీలు విధించకుండా రద్దు చేసుకునేలా విమానయాన సంస్థ లాకిన్‌ సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. విమానం బైల్దేరడానికి 96 గంటల ముందు దాకా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది‘ అని సిన్హా చెప్పారు.

ప్రస్తుత నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ఒక్కో విధంగా క్యాన్సిలేషన్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి. అసంబద్ధమైన చార్జీలు వసూలు చేస్తున్నాయని, రిఫండ్‌ ఇవ్వడం లేదని పలు సంస్థలపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొత్త ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా సంబంధిత వర్గాల అభిప్రాయాలు సేకరించి, రెండు నెలల్లోగా నోటిఫై చేస్తామని సిన్హా తెలిపారు.  

చార్టర్‌లో మరిన్ని ప్రతిపాదనలు..
  మార్గదర్శకాల ప్రకారం.. క్యాన్సిలేషన్‌ చార్జీలను టికెట్టుపై ప్రముఖంగా ముద్రించాలి. క్యాన్సిలేషన్‌ చార్జీలు ఎట్టిపరిస్థితుల్లోనూ బేసిక్‌ ఫేర్, ఇంధన సర్‌చార్జీని మించరాదు.  
    విమాన సర్వీసులో జాప్యం కారణంగా ప్యాసింజరు కనెక్టింగ్‌ ఫ్లయిట్‌ని అందుకోలేకపోయిన పక్షంలో ఎయిర్‌లైన్స్‌ రూ. 5,000 నుంచి రూ. 20,000 దాకా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆఖరు నిమిషంలో విమాన సర్వీసును క్యాన్సిల్‌ చేసిన పక్షంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఫ్లయిట్‌లో పంపాలి. అయితే, వాతావరణ సంబంధ సమస్యల కారణంగా జాప్యం జరిగితే మాత్రం ఎయిర్‌లైన్స్‌ బాధ్యత ఉండదు.  
   ఒకవేళ ప్రయాణికుల బోర్డింగ్‌కు నిరాకరించినట్లయితే.. కనిష్టంగా రూ. 5,000 పైచిలుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.
    త్వరలోనే విమానంలోనే వై–ఫై సదుపాయం అందుబాటులోకి. 

మరిన్ని వార్తలు