పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా..

12 Oct, 2017 15:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మొబైల్‌ వాలెట్‌ కంపెనీ పేటీఎంలో బంగారం అమ్మకాలు భారీగా పెరుగనున్నాయి. రాబోతున్న దంతెరాస్‌, దివాలి సందర్భంగా తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం అమ్మకాలు ఐదింతల వృద్ధిని నమోదుచేస్తాయని పేటీఎం అంచనావేస్తోంది. గోల్డ్‌ రిఫైనరీ ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, తమ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొనుగోళ్లకు వినియోగదారులకు అనుమతి ఇచ్చింది. మరింత మంది కస్టమర్లను తమ ప్లాట్‌ఫామ్‌పై తెచ్చుకోవడం కోసం మార్కెటింగ్‌కు కంపెనీ రూ.10 కోట్లను పెట్టుబడులు పెడుతోంది.

అదేవిధంగా దివాలి గోల్డ్‌ సేల్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. అక్టోబర్‌ 10 నుంచి అక్టోబర్‌ 19 వరకు బంగారం కొనుగోలు చేసిన వారికి ఎక్కువ రివార్డింగ్‌ కూడా ఇస్తోంది. కనీసం రూ.10వేల మొత్తంతో కొనుగోలు చేస్తే 3 శాతం అదనపు బంగారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది మొదట్లో ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం, ఒక్క రూపాయికే బంగారాన్ని ఆఫర్‌ చేసిన సంగతి తెలిసిందే. 

'' భారతీయులు బంగారాన్ని ప్రేమిస్తారు. దంతెరాస్‌ లాంటి పండుగల కాంలో లక్షల కొద్దీ భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు'' అని పేటీఎం సీనియర్‌ వైస్‌-ప్రెసిడెంట్‌ నితిన్‌ మిశ్రా చెప్పారు. ప్రస్తుతం డిమాండ్‌ తొలి దశలో ఉందని, దంతెరాస్‌, దీపావళి కాలంలో ఈ డిమాండ్‌ మరింత పెరుగుతుందని కంపెనీ తెలిపింది. పేటీఎం గోల్డ్‌ కోసం నెలవారీ కనీసం 20 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని నితిన్‌ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు