15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్‌లో సంచలన ఆవిష్కరణ

16 Dec, 2023 17:53 IST|Sakshi

గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని గీలీ హోల్డింగ్ గ్రూప్‌కు చెందిన బ్యాటరీ ప్లాంట్‌లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది.

జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేష‌న్స్‌లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు