నీరవ్‌,చోక్సీలకు బిగ్‌ షాక్‌!

3 Mar, 2018 15:50 IST|Sakshi
నీరవ్‌మోదీ, చోక్సీ ఫైల్‌ ఫోటో

సాక్షి,ముంబై: పీఎన్‌బీ కుంభకోణంలో డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్‌  అధిపతి మెహుల్‌ చోక్సీలపై చర్యలకు సీబీఐ, ఈడీ వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం వీరువురికీ ముంబై స్పెషల్‌  కోర్టు నాన్‌బెయిలబుల్‌  అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.  విదేశాల్లో వ్యాపార వ్యవహారాల నిమిత్తం విచారణ హాజరుకాలేనని మొండికేసిన నీరవ్‌ మోదీకి వచ్చే వారం కచ్చితంగా విచారణకు హాజరు  కావల్సిందేనంటూ  ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఎ కోర్టు  కొరడా ఝళిపించింది.   ఈ మేరకు హైకమిషన్‌ను సంప్రదించాలని  మోదీ, చోక్సీలను సీబీఐ   కోరింది. వారి  ప్రయాణ కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పింది.

దాదాపు 12వేలకోట్ల రూపాయల కుంభకోణం  కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ  మోదీ, చోక్సిల  చుట్టూ  ఉచ్చు  బిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. వేలకోట్లను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన  నీరవ్‌మోదీ, చోక్సీలకు చెందిన పలు ఆస్తులను  స్వాధీనం చేసుకోవడంతోపాటు  నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ   చేయాల్సిందిగా ఇప్పటికే సీబీఐ పీఎంఎల్‌ఎ కోర్టును కోరాయి. మరోవైపు ఈ  కేసులో ఆరుగురు నిందితులను ముంబై కోర్టులముందు సీబీఐ హాజరు పర్చింది.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్‌ శెట్టి, సహా ఆరుగురిని కోర్టుముందు హాజరుపర్చింది.  కేసు మరింత విచారణ నిమిత్తం నిందితుల పోలీసు కస్టడినీ కోరింది. అలాగే నీరవ్‌ మోదీ,  ఆయన భార్య,  మెహల్ చోక్సి పాస్‌పోర్టులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు