సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. లాభాలతో ప్రారంభమైన కీలక సూచీలు అమ్మకాలు ఊపందుకోవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 505 పాయింట్లు పతనమై 37,585 వద్ద, నిఫ్టీ 138పాయింట్లు కోల్పోయి 11,376 స్థాయికి చేరింది. దీంతో సెన్సెక్స్ నిఫ్టీ మద్దతు స్థాయిలను కోల్పోయాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ నష్టాలే. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ టాప్ లూజర్ గా ఉంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా , ఆటో, ఐటీ నష్టపోతుండగా, రియల్టీ స్వల్పంగా లాభపడుతోంది.
హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఐబీహౌసింగ్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ టాప్ లూజర్స్గా ఉండగా, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఎయిర్టెల్, ఐవోసీ, టెక్ మహీంద్రా, విప్రో, టాటా స్టీల్, ఐషర్, హెచ్సీఎల్ టెక్, పవర్గ్రిడ్ లాభపడుతున్నాయి.
ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం నేడు 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10-25 శాతం మధ్య సుంకాల విధింపునకు సిద్ధపడుతున్నట్లు వెలువడ్డ వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాకిచ్చింది. దీంతో తొలుత ఆసియా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు తెరలేచింది. అలాగే దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి సైతం ఒక్కసారిగా బలహీనపడింది.