సిండికేట్‌ బ్యాంక్‌ లాభం రూ.140 కోట్లు

10 May, 2017 05:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.104 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఈ బ్యాంక్‌కు రూ.2,158 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. కేటాయింపులు తగ్గడం, ఇతర ఆదాయం అధికంగా రావడంతో మొండి బకాయిలు పెరిగినా, బ్యాంక్‌ నికర లాభం సాధించిందని నిపుణులంటున్నారు.

 మొత్తం ఆదాయం రూ.6,525 కోట్ల నుంచి రూ.6,913 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,462 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.1,861 కోట్లకు, ఇతర ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.842 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు పెరిగినట్లు బ్యాంకు తెలియజేసింది. స్థూల మొండి బకాయిలు 6.7 శాతం నుంచి 8.5 శాతానికి,  నికర మొండి బకాయిలు 4.48 శాతం నుంచి 5.21 శాతానికి పెరిగాయి.

 పన్నులు, మొండి బకాయిలు, ఇతరాలకు కేటాయింపులు రూ.2,383 కోట్ల నుంచి రూ.1,268 కోట్లకు తగ్గాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.1,643 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.359 కోట్ల నికర లాభం వచ్చింది.       ఇక బ్యాంక్‌ ఎండీగా మల్విన్‌ ఓస్వాల్డ్‌ రెగోను ప్రభుత్వం నియమించింది. అరుణ్‌ శ్రీవాత్సవ స్థానంలో ఆయన ఈ ఏడాది జూలై 1 నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

మరిన్ని వార్తలు