నో మోర్‌ టాక్స్‌ ఫ్రీ: ఇక బాదుడే..!

1 Jan, 2018 19:23 IST|Sakshi


సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. టాక్స్‌ ఫ్రీ అనే మాటకు ఈ రెండు గల్స్‌ దేశాలు చరమ గీతం పలికాయి.  ఇప్పటివరకు ఎలాంటి పన్నులు లేకుండా  ఉన్న గల్ఫ్‌ దేశాల్లో తొలిసారిగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌) అమల్లోకి రానుంది.  దీని ద్వారా రెండు ప్రభుత్వాలు 2018 నాటికి 21 బిలియన్ డాలర్లను ఆర్జించాలని ప్రణాళిక వేశాయి. తద్వారా జీడీపీలో 2 శాతం వృద్ధి సాధించనున్నట్టు అంచనా  వేశాయి.  గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికులపై ఈ ప్రభావం పడనుంది.

ఇటీవలికాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది.  బడ్జెట్ లోటుకు దారితీసింది. దీంతో గత రెండు సంవత్సరాల్లో ఆదాయం పెంచడం, వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టిన ఆయిల్‌ దేశాలు కొత్త ఏడాది తొలిరోజు (సోమవారం) నుంచి  వ్యాట్   అమలు చేయనున్నాయి.  మొదటి సంవత్సరంలోఆదాయం సుమారు 12 బిలియన్ దిర్‌హామ్‌లు (3.3 బిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేసింది. దీని ద్వారా సౌదీ ప్రభుత్వానికి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల వృద్ధికి సహాయపడుతుందని షాహారా (కౌన్సిల్) కౌన్సిల్ సభ్యుడు  మహ్మద్ అల్-ఖునిజీ చెప్పారు.

తాజా ఆదేశాల ప్రకారం ఇక అక్కడివారు వివిధ వస్తువులు, సేవలపై సేల్స్‌ టాక్స్‌ 5 శాతం చెల్లించాలి. ముఖ్యంగా ఆహారం, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్,  గ్యాసోలిన్, ఫోన్, నీరు, విద్యుత్ బిల్లులు, హోటల్ రిజర్వేషన్లులాంటి వాటిపై  ఈ పన్నును విధించనుంది.   అయితే మెడికల్‌,  బ్యాంకులు, ప్రభుత్వ రవాణాను  దీన్నుంచి మినహాయింపు  ఇవ్వనుందని తెలుస్తోంది. మరోవైపు ఇతర నాలుగు గల్ఫ్ రాష్ట్రాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్‌ కూడా  వ్యాట్‌ ను విధించాలని యోచిస్తోన్నాయి.  2019 ప్రారంభంలో ఈ పన్ను బాదుడుకు  శ్రీకారం చుట్టనున్నాయని సమాచారం.

మరిన్ని వార్తలు