అలాంటి జాబ్స్‌ వద్దే వద్దు...

6 Oct, 2017 01:11 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పొద్దున్నే డ్యూటీ ఎక్కి ఎంచక్కా సాయంత్రానికి ఇంటి కెళ్తే బిందాస్‌...ఇది పాతమాట. మరి కొత్త బాట ఏంటంటారా..? కొలువుల తీరు మారుతుండటమే నయా ట్విస్ట్‌. ఓ రీసెర్చిలో వెల్లడైన అంశాలు ఉద్యోగుల్లో నూతన పోకడలకు అద్దం పడుతున్నాయి. నైన్‌ టూ ఫైవ్‌ ఉద్యోగాలకు కాలం చెల్లిందని, నూతన తరం ఉద్యోగాలనే యువత కోరుతున్నదని ఓ అథ్యయనంలో వెల్లడైంది. మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ నిర్వహించిన అథ్యయనంలో రాబోయే ఉద్యోగాల్లో పార్ట్‌టైమ్‌, ఫ్రీల్యాన్స్‌, కాంట్రాక్ట్‌, తాత్కాలిక ఉద్యోగాలే ఎక్కువగా ఉంటాయని తేలింది.

ఇప్పటి ఉద్యోగులెవరూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కుర్చీలకు అతుక్కుపోవాలని అనుకోవడం లేదని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. నూతన ఉద్యోగ పోకడలకు భారత్‌, మెక్సికో వంటి ఎదుగుతున్న మార్కెట్లలో మంచి ఆదరణ లభించిందని ఈ అథ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలకు చెందిన 9500 మందిని ఈ సర్వే పలుకరించింది. భారత్‌లో 785 మంది ఉద్యోగుల నుంచి వారి అభిరుచులను రాబట్టారు. సంప్రదాయ ఉద్యోగాల కంటే ఫ్రీగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఉద్యోగాలకే తమ ఓటని భారత ఉద్యోగుల్లో 85 శాతం మందికి పైగా వెల్లడించారు. ఉద్యోగంతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకునేందకు అనుకూలమైన ఉద్యోగాలే తమ ప్రాధాన్యత అని చెప్పారు.గత పదేళ్లలోనూ ఈ తరహా ఉద్యోగ నియామకాలే ఎక్కువగా చోటుచేసుకున్నాయని మాన్‌పవర్‌ గ్రూప్‌ వెల్లడించింది.

మరిన్ని వార్తలు