డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..

5 Dec, 2019 05:38 IST|Sakshi

కంపెనీలపై రూ. 15 కోట్ల దాకా జరిమానా

వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్‌ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు..

► వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్‌ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్‌ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాలి.

► ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది.

► చిన్నపాటి ఉల్లంఘనలకు కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్‌ టర్నోవరులో 2% దాకా జరి మానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు.

మరిన్ని వార్తలు