విస్తారా ధరలు కూడా తగ్గాయ్.. !

8 Jun, 2016 17:05 IST|Sakshi
విస్తారా ధరలు కూడా తగ్గాయ్.. !

న్యూఢిల్లీ : వివిధ డిస్కౌంట్ స్కీమ్స్ తో విమానసంస్థలు ప్రయాణికుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి సంస్థలు ఆఫర్లు ప్రకటించగా.. తాజాగా విస్తారా సైతం తన ప్రయాణికుల టిక్కెట్ ధరలకు డిస్కౌంట్ ను ప్రకటించింది.  జూలై, సెప్టెంబర్ మధ్యలో ప్రయాణించేవారికి టిక్కెట్ ధరలపై 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. మరో సంస్థ జెట్ ఎయిర్ వేస్ తన 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను పొడిగించింది. దేశీయ మార్గాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని, జూన్ 8 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.

టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ కు జాయింట్ వెంచర్ అయిన విస్తారా.. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్ ను తీసుకొస్తోంది. జూన్ 10 వరకు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా తెలిపింది. ఆఫర్ ధరల కింద రూ.1,099కి ఎకానమీ క్లాస్, రూ.2,284కు ప్రీమియం ఎకానమీ, రూ.5,775కు బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరలు ప్రారంభం కాబోతున్నాయని విస్తారా ప్రకటించింది.

ఈ స్కీమ్ కింద ఢిల్లీ నుంచి ముంబై మార్గ ఎకానమీ క్లాస్ ఎయిర్ టిక్కెట్లకు రూ.1,920 ధర ఆఫర్ చేస్తున్నామని, రెగ్యులర్ గా అయితే ఈ మార్గంలో ధర రూ.2,743గా ఉంటుందని తెలిపింది. ఢిల్లీ-బెంగళూరు మార్గంలో కూడా రెగ్యులర్ గా ఉన్న రూ.3,093 ధరను, డిస్కౌంట్ ఆఫర్ కింద రూ.2,165కు తగ్గించేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రమోషన్ ఆఫర్ టిక్కెట్ బుక్ చేసుకున్న అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. విస్తారా వెబ్ సైట్ నుంచి టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికైతే అదనంగా 5శాతం డిస్కౌంట్ ఆఫర్ ను పొందుతారని తెలిపింది.

మరిన్ని వార్తలు