రూ.538 కోట్ల విలువైన జెట్‌ఎయిర్‌వేస్ ఆస్తులు సీజ్

1 Nov, 2023 18:51 IST|Sakshi

ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.538 కోట్లకు పైగా విలువ గల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన  భార్య, కుమారుడికి చెందిన లండన్‌, దుబాయ్‌ సహా భారత్‌లో వివిధ ప్రదేశాల్లో ఉన్న 17 కమర్షియల్ ఫ్లాట్‌లు, ఇతర ఆస్తులను  ఈడీ ఈ మేరకు సీజ్‌ చేసింది.

దాదాపు 26 సంవత్సరాలుగా పూర్తి వాణిజ్య సేవలు అందించిన జెట్ ఎయిర్‌వేస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నగదు కొరత కారణంగా ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను నిలిపివేసింది. 2019లో గోయల్ ఎయిర్‌లైన్ చైర్‌పర్సన్‌గా వైదొలిగిన తర్వాత జెట్ ఎయిర్‌వేస్.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ని దాఖలు చేసింది. 

కెనరా బ్యాంకులో రూ.538 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సెప్టెంబర్ ప్రారంభంలో ఈడీ నరేష్ గోయల్‌ను అరెస్టు చేసింది. బ్యాంకు నుంచి రుణంగా పొందిన ఆదాయంతో విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు  ఆరోపించింది. ఈ కేసులో నేరష్ గోయల్‌తో పాటు మరో ఐదుగురిపై ఈడీ మంగళవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఉన్న నిందితుల ఆస్తులపై ఈ ఏడాది జులైలోనే ఈడీ దాడులు జరిపింది. 

జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.848.86 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తే.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలు ఉన్నాయని కెనరా బ్యాంకు ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 2021 జూలై 29న ఈ కేసును మోసంగా ప్రకటించబడిందని కూడా సీబీఐ పేర్కొంది.  

ఇదీ చదవండి: Wine Capital of India: దేశంలో మద్యం రాజధాని ఏది?

మరిన్ని వార్తలు