మోదీ ప్రభుత్వానికి చమురు సెగ?

16 Jan, 2018 11:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశన్నంటుతున్న చమురు ధరలు  కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ ప్రభుత్వానికి   ప్రతికూలంగా మారనున్నాయా?   వివిధ సంస్కరణలతో ప్రజలకు ఆకట్టుకుంటూ.. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న మోదీ సర్కార్‌కు చమురు ధరల   సెగ తాకనుందా? అంటే  అవుననే  సంకేతాలనిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.   ముఖ్యంగా  మరికొన్ని రోజుల్లో   చివరి  ఆర్థిక బడ్జెట్‌( ఫిబ్రవరి , 1) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు  కేంద్రానికి పెద్ద తలనొప్పేనని భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలలో చమురు ధరల తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వానికి సాయపడినప్పటికీ..ఇపుడు  అప్రతిహతంగా పెరుగుతున్న ధరలు   మోదీ సర్కార్‌కు  ప్రమాదమే అంటున్నారు.

పన్ను సంస్కరణలను హేతుబద్ధం చేయడం, 2019 లో సాధారణ ఎన్నికల ముందు డ్యూటీ రేట్లను తగ్గించడం వంటి ప్రధాన సంస్కరణలతో  ఆదరణ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 70 డాలర్లు దాటితే  మరిన్ని కష్టాలు తప్పవని  నిపుణుల విశ్లేషణ.  అటు గత వారం చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను   పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తారా అని ప్రశ్నించినపుడు.. ఆ మాట ముందు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగాలన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాం..రాష్ట్ర  ప్రభుత్వాలు  వ్యాట్‌ను తగ్గించాలని సమాధానమివ్వడం  గమనార్హం. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా డీజిల్ ధరలు అక్టోబరు 4, 2017 నాటికి రూ.56.89 స్థాయికి చేరింది. అయితే ఆ తరువాత  పుంజుకున్న  చమురు ధర ఎక్కడా వెనక్కి తగ్గకుండా పైపైకి దూసుకపోతోంది.

మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు ర్యాలీకి కొనసాగుతోంది. సోమవారం డీజిల్ ధర లీటరుకు రూ.61.88 గా రికార్డ్‌ స్థాయి నమోదు కాగా  పెట్రోలు ధర రూ.71 దాటేసింది. ఢిల్లీలో  లీటరుధ ర రూ. 72 గా ఉంది.  డిసెంబరు 12, 2017 తరువాత ధరలు పెరుగుతుండగా, ఆ రోజునాటికి  ఢిల్లీలో డీజిల్ ధర రూ. 58.34 గా ఉంది. గడచిన నెలలో రూ. 3.54 పెరిగింది.  గత వారం బ్రెంట్ టర్నోవర్ 70.05 డాలర్లుగా నిలిచింది. డబ్ల్యుటిఐ 64.77 డాలర్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు