కుటుంబ సభ్యుల్ని కాల్చి చంపిన మైనర్‌..

3 Sep, 2019 17:58 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఓ మైనర్‌ బాలుడు కుటుంబంలోని ఐదుగురిని హత్య చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అలబామాలో నివాసముంటున్న ఐదుగురు కుటుంబ సభ్యుల్ని ఇంటి వద్దనే 14 ఏళ్ల మైనర్‌ బాలుడు తుపాకీతో కాల్చి హతమార్చాడు. అనంతరం తానే పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ విషయాన్నిపోలీసులు మంగళవారం మీడియా ముందు వెల్లడించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే మరణించగా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. బాలుడు కాల్పుల్లో ఉపయోగించిన తుపాకీ నూతన టెక్నాలజీతో తయారు చేసిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, విచారణలో నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని వెల్లడించారు. అయితే అతనికి ఆ తుపాకీ ఎలా చేరిందని, కుటుంబాన్ని చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కాగా అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పులు ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత వారం టెక్సాస్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా 22 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. అంతేగాక గత నెలలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు