మైలవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

30 Dec, 2017 14:58 IST|Sakshi

మైలవరం: కృష్ణాజిల్లా మైలవరం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. మైలవరం నుంచి ఆటోలో 11 మంది వ్యక్తులు పుల్లూరు చర్చిలో ప్రార్థనలో పాల్గొనేందుకు వెళుతుండగా భద్రాచలం నుంచి మైలవరం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా ఆటో డ్రైవర్‌ను విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

మైలవరం నుంచి సొంత ఆటోలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మండలంలోని పుల్లూరు గ్రామంలో ప్రార్థనలో పాల్గొనేందుకు 30వ నంబర్‌ జాతీయ రహదారిపై వెళుతుండగా వేగంగా వస్తున్న కారు స్థానిక దర్గా సమీపంలో ఆటోను ఢీకొట్టింది. ఆటో ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి రోడ్డు మధ్యకు రావడంతో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టిందని ప్రమాద స్థలంలో ఉన్న వారు తెలిపారు.

మృతి చెందిన వారు మైలవరానికి చెందిన సగ్గుర్తి లత (40), గరికపాటి నాగమణి (25), మందా రాజేశ్వరి (17), గరికపాటి నాగేశ్వరరావు (34) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మందా రూతమ్మ, పల్లెపోగు కన్యాకుమారి, పల్లెపోగు జన్ని, గరికపాటి యశస్విని, సగ్గుర్తి సుశీల, కటారపు రాణి, పల్లెపోగు జెస్సి ఉన్నారు. స్వల్పంగా గాయపడిన వారిలో కారులో ప్రయాణిస్తున్న షేక్‌ రసూల్, లావూడియా మనోహర్, ముత్యాల సతీష్, డి. రాహుల్, బుద్దా ప్రవీణ్‌ ఉన్నారు. కాగా పాల్వంచ నుంచి ఐదుగురు వ్యక్తులు గన్నవరం విమానాశ్రయానికి వారి బంధువును తీసుకువచ్చేందుకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వార్తలు