హంతకుడి డైరీ.. 36 మంది టార్గెట్‌

30 Jun, 2018 16:52 IST|Sakshi

బెంగళూరు : ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో అనుమానితుడు అమోల్ కలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో నుంచి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి.   గౌరీ లంకేశే కాకుండా  మరో 36 మంది ప్రముఖులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు డైరీలో రాసుకున్నారు. ఈ ఆపరేషన్‌ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్‌మెంట్‌ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నటు సిట్‌ అధికారులు వెల్లడించారు.

హిందూత్వ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే వీరి టార్గెట్‌. వీరి టార్గెట్‌లోమహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్రముఖులే ఎక్కువగా ఉన్నారు. కర్ణాటకు చెందిన 10 మంది ప్రముఖులను హత్య చేయాలని డైరీలో రాసుకున్నారు. హత్యల కోసం 50 మందిని రిక్రూట్‌ చేసుకొని వారికి గన్స్‌, తుపాకీ, పెట్రోల్‌ బాంబ్‌ పేల్చడం టాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చారని డైరీలో కోడ్‌ భాషలో రాసుకున్నారని ఓ అధికారి తెలిపారు. 

గతేడాది సెప్టెంబర్‌ 5న తన నివాసం వద్ద ఉన్న గౌరీలంకేశ్‌పై బైకుపై వచ్చిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్‌ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్‌ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు. గౌరీ లంకేశ్‌ హత్యకోసం వాగ్మారే రూ.3000 అడ్వాన్స్‌గా తీసుకున్నారు. హత్యకు ముందు రోజు రూ. 10,000 తీసుకున్నారని విచారణలో వాగ్మారే తెలిపారు.

మరిన్ని వార్తలు