అయ్యో..పాపం

7 May, 2019 13:30 IST|Sakshi
పెనుగంచిప్రోలు నవాబుపేట వద్ద జాతీయరహదారిపై బోల్తా పడిన రమణ ట్రావెల్స్‌ బస్సు

యానం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

10 మంది పిల్లలు సహా 32 మందికి గాయాలు

ఒక పాప పరిస్థితి ఆందోళనకరం

క్షతగాత్రుల్లో తూర్పు గోదావరి జిల్లా వాసులే అధికం

డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణం

అందరూ హాయిగా నిద్రిస్తున్నవేకువజాము వేళ.. వేగంగాదూసుకెళుతున్న బస్సు..మరో నాలుగు గంటల్లోఅంతా గమ్యస్థానాలకు చేరుకుంటారు.. ఈలోపు ఒక్కసారిగాపెద్ద కుదుపు.. ఉన్నట్టుండిబస్సు గాలిలోకి ఎగిరింది..ఏమైందో అర్థమయ్యేలోపేబస్సులో ఉన్న వారినందిరినిక్షతగాత్రులుగా మార్చేసింది..ఆర్తనాదాలు, హాహాకారాలతోఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితిఆవరించింది. యానం నుంచిహైదరాబాద్‌ వెళ్తున్న రమణ  ట్రావెల్స్‌ బస్సు పెనుగంచిప్రోలుమండలం నవాబుపేట వద్దజాతీయ రహదారిపైసోమవారం తెల్లవారుజాము2.45 గంటలకు ఘోర రోడ్డుప్రమాదానికి గురైంది.   

కృష్ణాజిల్లా : నవాబుపేట క్రాస్‌రోడ్స్‌ (పెనుగంచిప్రోలు): పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై రమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా కొట్టింది. సోమవారం తెల్లవారు జామున 2.45 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది పిల్లలు  సహా 32 మందికి గాయాలయ్యాయి. రమణ టూర్స్, ట్రావెల్స్‌కు సంబంధించిన ఏపీ05 టీఎల్‌ 1430 నంబర్‌ గల సూపర్‌ లగ్జరీ బస్సు కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి ఆదివారం రాత్రి 9గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరింది. హైదరాబాద్‌ సోమవారం ఉదయానికి చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా వస్తున్న బస్సు ఒక్కసారిగా నవాబుపేట వద్దకు వచ్చే సరికి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పెద్ద గోతిలో పడి బోల్తా కొట్టింది.

తూర్పు గోదావరి వాసులే..
బస్సులో మొత్తం 44 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మందపాటి చిన్ని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. బస్సులోని మిగిలిన ప్రయాణికులను పోలీసులు పలు వాహనాల్లో వారి ప్రాంతాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని నందిగామ ఆర్టీఓ మూర్తి, జగ్గయ్యపేట ఎంవీఐ రాజులు సందర్శించి వివరాలు సేకరించారు.

గాయపడిన వారి వివరాలు..
గాయపడిన వారిలో ప్రమాదం జరిగిన సమయంలో బస్సు నడుపుతున్న తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరానికి చెందిన షేక్‌ వలీ, మరో డ్రైవర్‌ ముమ్మడివరం గ్రామానికి చెందిన షేక్‌ సుభాని ఉన్నారు. అలాగే బస్సులోని ప్రయాణికులు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం దాక్షారామంకు చెందిన సుందరపల్లి రమేష్, టేకు గ్రామానికి చెందిన గుత్తుల శ్రీనివాస్, ఐ.పోలవరం మండలం పసుపులంక గ్రామానికి చెందిన వైదాడి మాణిక్యాలరావు, నెరటూరు గ్రామానికి చెందిన కడలి వేణు, అదే గ్రామానికి చెందిన అడసూరి శ్యామల, సీహెచ్‌ అంజి, పీతాని రాఘవేంద్ర, చోడె అనిత అన్నారు.
కె. గంగవరం మండలం వాసాలరేవుకు చెందిన రచ్చ వీరరాజు, పాలూరు గ్రామానికి చెందిన బోడపాటి సావేరి, సత్యవాడ గ్రామానికి చెందిన మందపాటి చిన్ని, మండగండె గ్రామానికి చెందిన చిన్నవరకుమార్, పెంటపాడుకు చెందిన అడప హరీష్‌ గాయాల పాలయ్యారు.

కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన కనికల్ల అప్పారావు,  పోరుమిల్లి గ్రామానికి చెందిన పేరాబత్తుల నాగేశ్వరరావు, మండపేటకు చెందిన పీ సాయిదుర్గ, నాగతిప్ప గ్రామానికి చెందిన కె సూర్యారావు, టేకి అబ్బాయి గాయాల పాలయ్యారు. అలాగే అదే మండలం పాలూరు గ్రామానికి చెందిన చింతపల్లి అనంతలక్ష్మీ, నిడసనమెట్ల గ్రామానికి చెందిన ఎస్‌. వెంకటరమణ, ఎడిద గ్రామానికి చెందిన టేకు దేవి, తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామానికి చెందిన కేమిశెట్టి రమ్య, నెలటూరు గ్రామానికి చెందిన బి. లావణ్యలు ఉన్నారు.
అలాగే హైదరాబాద్, అమీర్‌పేట్‌కు చెందిన బి. పార్వతి, తాడేపల్లిగూడెంకు చెందిన కడలి రాజేంద్రప్రసాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన కె. గోవింద్, భార్య కుమారి, కాజులూరు మండలం నామావానిపాలెం గ్రామానికి చెందిన బి. మాధురి, మండలపేట మండలం ఎడిద గ్రామానికి చెందిన టేకు దివ్య, అదే గ్రామానికి చెందిన టేకు వెంకన్న, ఉన్నారు.   

క్షతగాత్రుల ఆర్తనాదాలు.....
తెల్లవారు జామున జరిగిన ఈబస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బస్సులో ఇరుక్కు పోయిన వారు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. నందిగామ డీఎస్పీ బోస్, జగ్గయ్యపేట సీఐ నబీ, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు ఎస్‌ఐలు నాగదుర్గారావు, చిరంజీవులు సిబ్బందితో పాటు హైవే పెట్రోలింగ్‌ వారంతా బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయ సహకారాలు అందజేశారు.

రెండు గంటలపాటు..
డ్రైవర్‌ వలీ బస్సులో ఇరుక్కొని పోవటంతో సుమారు రెండు గంటలపాటు కష్టపడి గ్యాస్‌ కట్టర్స్‌ సహాయంతో ఇనుప కడ్డీలు కట్‌చేసి అతనిని బయటకు తీశారు. అనంతరం క్రేన్‌ సహాయంతో బస్సును పైకి లేపారు. బస్సులో ఉన్న ప్రయాణికుల లగేజిని పోలీసులు వారికి అప్పగించారు. కానీ ప్రయాణికుల్లో ఒకరు సెల్‌ఫోన్‌ దొరకలేదని, కొందరు నగదు లేదని, మరి కొందరు లగేజి కనిపించటం లేదని చెప్పటం గమనార్హం.

గతంలోనూ ఇదే ప్రాంతంలో..
గతంలో ఇక్కడికి కొద్ది దూరంలోనే జేసీ దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు గోతిలో పడి 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. అలాగే గత నెల 16న తెలంగాణ ఆర్టీసీ బస్సు పల్టీ కొట్టి ఇద్దరు డ్రైవర్లు మృతి చెందటంతో పాటు 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తాజాగా సోమవారం తెల్లవారు జామున ఆ ప్రమాదానికి కొద్ది మీటర్ల దూరంలోనే బస్సు పల్టీ కొట్టి 32 మంది గాయపడటంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే పెద్ద ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నబీ తెలిపారు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రులు..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రమాదంలో గాయపడిన 18 మందిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వారిలో కె. వేణు (12) బాలుడికి ఛాతీలో గాయమైనట్టు గుర్తించి కార్డియో థోరాసిక్‌ సర్జరీ విభాగం ఇక్కడ లేనందున గుంటూరు తరలించారు. కాగా గాయాలై ప్రభుత్వాస్పత్రికి వచ్చిన వారిలో బి. సవేరి, ఎ. శ్యామల, కె. రవి, జి. రమ్య, సీహెచ్‌ మాధురి, ఎ. హరీష్, ఎస్‌. రమేష్, ఎస్‌కే సుభానీ, చిన్ని, అప్పారావు, టి. దేవి, టి. దివ్య, పద్మ, శ్రీనివాస్, టి. వెంకన్న, సాయిదుర్గ, సత్యలు ఉన్నారు. వీరిలో ఒకరికి గుంటూరు తరలించగా, మరో 14 మందికి ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. కాగా తలకు బలమైన గాయాలైన బాలిక చిన్ని, శ్రీనివాస్, రమ్యలు ప్రస్తుతం ట్రామాకేర్‌ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా వీరి ముగ్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వారికి వైద్యసేవలు అందిస్తున్న న్యూరోసర్జన్‌ డాక్టర్‌ గొల్ల రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.

డ్రైవర్‌ నిద్రమత్తే కారణం..
మండల పరిధిలోని 65వ నంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన రమణ టూర్స్, ట్రావెల్స్‌ బస్సుకు అన్ని రకాల పర్మిట్లు ఉన్నాయని నందిగామ ఆర్టీఓ సూర్యనారాయణ మూర్తి తెలిపారు. అలాగే బస్సు కూడా పూర్తి కండిషన్‌లో ఉందని, డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు