88 మంది బాలికలను వివస్త్రలుగా మార్చి.. పనిష్మెంట్‌!

30 Nov, 2017 11:33 IST|Sakshi

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లో దారుణం జరిగింది. పనిష్మెంట్‌ పేరిట తోటి విద్యార్థినుల ముందు 88మంది బాలికలతో బలవంతంగా దుస్తులు విప్పించారు ముగ్గురు ఉపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా ఓ కాగితంలో అసభ్య వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ.. టీచర్లు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.

పాపుమ్‌ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఈ నెల 23న ఈ దారుణం చోటుచేసుకుంది. ఆరో, ఏడో తరగతికి చెందిన 88మంది బాలికలను ఇలా అవమానించారు. ఈ నెల 27న బాధిత విద్యార్థినులు ఆల్‌ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్‌ఎస్‌యూ)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్‌ఎస్‌యూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. ఓ విద్యార్థిని, ప్రధానోపాధ్యాయుడి పట్ల అసభ్య వ్యాఖ్యలు రాసి ఉన్న కాగితం దొరకడంతో ఇద్దరు అసిస్టెంట్‌ టీచర్లు, ఒక జూనియర్‌ టీచర్‌ ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు. తోటి విద్యార్థినుల ముందు 88 మంది బాలికలతో దుస్తులు విప్పించి.. అవమానపరిచారు. ఈ ఘటనపై అరుణచాల్‌ప్రదేశ్‌లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు