సాక్షి, కర్నూలు : జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గురువారం 22వ రోజున వైఎస్ జగన్ ఆలూరు నియోజకవర్గంలోని కారుమంచి గ్రామంలో పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్ జగన్ను కలసిన కారుమంచి గ్రామ మహిళలు తమ సమస్యలను చెప్పుకుని ఆవేదన చెందారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మోసం చేశారని వాపోయారు.
మహిళల సమస్యలపై స్పందించిన వైఎస్ జగన్.. మహానేత హయాం నాటి చదువుల విప్లవాన్ని మళ్లీ తీసుకొస్తానని అన్నారు. కాలేజీల్లో ఫీజుల్లో ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఫించను రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెంచతామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.
చిన్నారికి నామకరణం
సాఫ్ట్వేర్ ఇంజనీర్ మిథిలారెడ్డి ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలసి తన కుమార్తెకు నామకరణం చేయాలని కోరారు. చిన్నారికి ‘రేయన్ష’ అని వైఎస్ జగన్ నామకరణం చేశారు. అనంతరం చిన్నారిని ముద్దాడారు.
రైతు పొలంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ
కారుమంచి గ్రామానికి చెందిన రైతు గొల్ల రామన్న తన పొలం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాసంకల్పయాత్రలో కారుమంచి నుంచి పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసిన రామన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కోరారు. రైతు పొలానికి వెళ్లిన వైఎస్ జగన్ చిన్నారితో విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. పూలమాల వేసి దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబానికి ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ జరిగిందని రైతు రామన్న చెప్పారు. తన కుమారులకు ఇళ్లు కూడా దక్కాయని తెలిపారు. ఆ అభిమానంతోనే సొంత ఖర్చుతో పొలం వద్ద వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.