భర్తపై బాలీవుడ్‌ నటి గృహహింస కేసు

6 Mar, 2019 16:57 IST|Sakshi

న్యూఢిల్లీ : బాలీవుడ్‌, టీవీ నటి అర్జూ గోవిత్రికర్‌ తన భర్త సిద్ధార్థ్‌ సబర్వాల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాగి వచ్చి రోజూ తనను కొడుతున్నాడని భర్తపై గృహ హింస కేసు పెట్టారు. బాత్‌రూంలో పడేసి తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడని పేర్కొంటూ... ఇందుకు ఆధారంగా తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా జత చేశారు. ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్‌ సబర్వాల్‌ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘ తన వృత్తిలో భాగంగా ఓ క్రైమ్‌ షో రిహార్సల్‌ కోసం తనను కొట్టాలని అర్జూ అడిగింది. కానీ ఇప్పుడేమో ఇలా చేసింది. నాపై ఆమె చేసిన ఆరోపణలకు సరైన వేదికపైనే సమాధానం చెబుతా’ అని వ్యాఖ్యానించాడు.

కాగా అర్జూ 2010లో వ్యాపారవేత్త అయిన సిద్ధార్థ్‌ సబర్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. సిద్ధార్థ్‌ కుటుంబంతో సహా ఇటీవలే వర్లీలోని కొత్త అపార్టుమెంటులోకి మారాడు. ఈ క్రమంలో వీరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తల్లెత్తినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తనకు కొడుకును దూరం చేస్తున్నాడంటూ అర్జూ.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అమితాబ్‌ సినిమా ‘బాగ్‌బన్‌’తో గుర్తింపు తెచ్చుకున్న అర్జూ.. ప్రస్తుతం నాగిన్‌, ఏక్‌ లడ్‌కీ అంజానీ సీ తదితర హిందీ సీరియళ్లలో నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు