నటి నీలాణికి బెయిల్‌ మంజూరు

29 Jun, 2018 08:35 IST|Sakshi
నీలాణి

పెరంబూరు: నటి నీలాణికి సైదాపేట కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల సంఘటనపై నటి నీలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియోలో చిత్రీకరించిన విషయం, పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపిన దృశ్యాలతో కూడిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత మే నెల 22న వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియో తీసింది ఎవరని దర్యాప్తు చేయగా స్థానిక సాలిగ్రామం, అష్టలక్ష్మీనగర్‌కు చెందిన నటి నిలాణి అని తెలిసింది. దీంతో ఆమెను ఈ నెల 19వ తేదీన అరెస్ట్‌ చేసి సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. ఆ తరువాత  కోర్టు ఆదేశాల మేరకు పుళల్‌ జైలుకు తరలించారు. కాగా నటి నిలాణి బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసుకుంది. ఆ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు నటి నీలానికి ‘పోలీసులకు సహకరించాలి, నగరం దాటి వెళ్లకూడదు’ లాంటి నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

మరిన్ని వార్తలు