విద్యార్థుల కళ్ల ముందే ప్రిన్సిపాల్‌ హత్య

15 Oct, 2018 09:00 IST|Sakshi
హత్యకు గురైన రంగనాథ్‌నాయక్‌ (ఫైల్‌) గదిలో రక్తపుమరకలు

బెంగళూరు : విద్యార్థుల కళ్ల ముందే ఆ ప్రధానోపాధ్యాయున్ని కాల్చి చంపారు దుండగులు. పట్టపగలే ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్‌ దారుణహత్యకు గురైన సంఘటన మాగడిరోడ్డు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.... మాగడిరోడ్డు అగ్రహార దాసరహళ్లిలోని హవనూరు పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌గా రంగనాథ్‌ నాయక్‌ (63) పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రంగనాథ్‌ తన కార్యాలయంలో ఉండగా ఐదారుగురు దుండగులు ప్రిన్సిపల్‌ కార్యాలయంలోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసి ఇష్టానుసారం పొడిచి సిబ్బంది వచ్చేలోపు పరారయ్యారు. సమాచారం అందుకున్న మాగడి పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు.  ఉత్తర విభాగ డీసీపీ చేతన్‌ సింగ్‌ రాథోడ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

స్థల వివాదమే కారణమా ? 
పాఠశాల వెనుకభాగంలో యాజమాన్యానికి, అక్కడే నివాసం ఉంటున్న గంగమ్మ అనే మహిళకు స్థల విషయంలో వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి రంగనాథ్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు 10 అడుగుల స్ధలం పాఠశాలకు వదిలిపెట్టాలని బీడీఏ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం  గంగమ్మకు చెందిన 10 అడుగుల స్ధలాన్ని స్వాధీనం చేసుకుని గొడను తొలగించారు. దీంతో గంగమ్మ కుమారుడు మహేశ్‌ ఆగ్రహంతో హత్య చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగనాథ్‌ నాయక్‌ హత్య విషయం తెలియగానే కుటుంబసభ్యుల్లో అక్రందనలు మిన్నంటాయి. 

>
మరిన్ని వార్తలు