రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం

8 Dec, 2023 05:02 IST|Sakshi

కేసు నమోదు చేసిన కేంద్ర జీఎస్టీ అధికారులు 

సాక్షి, అమరావతి: అక్రమంగా రవాణా చేస్తు­న్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్‌కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టా­రు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు.

ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్‌ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషన­రేట్‌ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు