కందకంలో పడి బాలుని మృతి

1 Aug, 2018 12:17 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు

సుజాతనగర్‌ : అటవీ ప్రాంతంలోని కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయిన బాలుడు ప్రాణాలొదిలాడు. సుజాతనగర్‌ మండలం గరీబ్‌పేట పంచాయతీ లక్ష్మీపురంతండాకు చెందిన లక్ష్మణ్, శాంత దంపతుల పెద్ద కుమారుడు భానుప్రసాద్‌(12), రుద్రంపూర్‌ జిల్లాపరిషత్‌ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. కటింగ్‌ సరిగ్గా చేయంచుకోకపోవడంతో ఈ నెల 30న అతడిని హెచ్‌ఎం హెచ్చరించారు.

మరుసటి రోజున తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పారు. ఆ బాలుడు, మంగళవారం తన తల్లిని తీసుకుని పాఠశాలకు వెళ్లాడు. కటింగ్‌ బాగా లేదని, సరిచేసి పంపించాలని బాలుడి తల్లితో ఉపాధ్యాయులు చెప్పారు. కుమారుడిని ఆ తల్లి ఇంటికి తీసుకెళ్లింది. అతడిని ఇంటి వద్దనే ఉంచి పొలం పనులకు వెళ్లింది.

తన స్నేహితులతో కలిసి అటవీ ప్రాంతం మీదుగా పొలానికి బయల్దేరిన భానుప్రసాద్, మార్గమధ్యలోగల కందకంలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్నేహితులు పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వచ్చి చెప్పారు. గ్రామస్తులు వెళ్లేసరికి భానుప్రసాద్‌ మృతిచెందాడు. తల్లిదండ్రులు, కుటుంబీకులు భోరున విలపించారు. 

మరిన్ని వార్తలు