ప్రేమికుడి ఘాతుకం

9 Nov, 2018 06:04 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న నిందితులు ,పద్మావతి (ఫైల్‌ ఫోటో)

పండుగ వేళ దారుణం

చోడవరంలో సంచలనమైన బాలిక హత్య

అత్యాచారం ఆపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టిన వైనం

కోటవీధిలో అలముకున్న విషాదం

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

విశాఖపట్నం, చోడవరం టౌన్‌: చోడవరం శివారు లక్ష్మీపురం రోడ్డులోని ఫారెస్టు డిపో సమీపంలో బుధవారం వెలుగులోకి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం, హత్య సంఘటన పట్టణంతో పాటు మండలంలో సంచలనమైంది. దీపావళి పండుగ పూట అంతటా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థిని పద్మావతిని ఇంటి ఎదురుగా ఉంటున్న తుంపాల రాజు ప్రేమిస్తున్నాడు. అతడే స్నేహితుల సాయంతో హత్య చేసి ఉంటాడని అంతా అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. 

చోడవరం కోటవీధికి చెందిన పిల్లల ఈశ్వరరావు, లక్ష్మీ దంపతుల రెండో కుమార్తె పిల్లల పద్మావతి (17) స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఎదురింటిలో ఉంటున్న మైనర్‌ బాలునితో ప్రేమలో పడింది.  ఇది తెలిసిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ మందలించారు. మంగళవారం రాత్రి  రాజు స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.

సంఘటన స్థలంలో మృతదేహం వద్ద పోలీసులు, స్థానికులు
ఆ తరువాత  అంతా పార్టీ చేసుకున్నారు.  బుధవారం ఫారెస్టు డిపో సమీపంలో బాలిక హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హత్యచేశాక పెట్రోలు పోసి తగులబెట్టడంతో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌కు పోలీసులు సమాచారం అందించారు. వారు వచ్చి అక్కడ ఆనవాళ్లు పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్‌  సంఘటన స్థలం వద్ద నుంచి పక్కనే ఉన్న తోటలు, ఖాళీ స్థలాల్లో తిరిగి సమీపంలో ఉన్న ఒక చర్చి వద్దకు వెళ్లి నిలిచిపోయాయి.

కాగా, ఇంటిలో మంగళవారం రాత్రి పడుకున్న కుమార్తె  తెల్లవారే సరికి కనిపించక పోవడంతో  ఈశ్వరరావు, లక్ష్మీ దంపతులు చుట్టుపక్కల  వెతుకుతున్న సమయంలో ఎవరో బాలిక హత్యకు గురైనట్లు గ్రామస్తులు చెప్పుకోవడంతో అనుమానం వచ్చి పోలీసుల వద్దకు వెళ్లారు. సంఘటన స్థలంలోని ఆనవాళ్లు ప్రకారం తమ కుమార్తెవే అని గుర్తించారు. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అనకాపల్లి తరలించి విచారిస్తున్నారు. గురువారం అనకాపల్లి డీఎస్పీ వెంకటరమణ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితులను దోషులుగా ఇంకా నిర్ధారించలేదని  సీఐ శ్రీనివాసరావు తెలిపారు.   మృతదేహాన్ని పోస్టుమార్టానికి విశాఖ  కేజీహెచ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు