బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

7 May, 2018 10:57 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు, ఇన్‌సెట్‌లో కావ్యారెడ్డి(ఫైల్‌)

శంకరపట్నం(మానకొండూర్‌) : కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో ఆదివారం బీటెక్‌ విద్యార్థిని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూమాడి కావ్యారెడ్డి(19) తిమ్మాపూర్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల ప్రథమసంవత్సర పరీక్షలు రాసింది. కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యింది. అదే విధంగా వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ యువకుడు కావ్యారెడ్డి సెల్‌కు మెసేజ్‌ పంపడంతో  20రోజుల క్రితం ఇంట్లోవారు యువతిని మందలించారు.

రెండు విషయాల్లో మనస్తాపం చెంది కొద్దికాలంగా మనోవేదనతో ఉంటోంది. తండ్రి సంపత్‌రెడ్డి ఆదివారం సోదరుడి వివాహానికి ఊరెళ్లాడు. తల్లి ఇంట్లోనే ఉంది. ఈ తరుణంలో కావ్యారెడ్డి బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. పొగలు రావడంతో గమనించిన తల్లి చుట్టపక్కల వారిని పిలిచింది. వారు వచ్చేసరికే పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. ఎస్సై ఎల్లాగౌడ్‌ సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు