రెట్టింపు పేరుతో నట్టేట ముంచి.. 

4 Jul, 2020 08:46 IST|Sakshi

పిఠాపురంలో బోర్డు తిప్పేసిన కంపెనీ

పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు 

పిఠాపురం(తూర్పుగోదావరి): చెల్లించిన సొమ్ముకు రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ ఓ కంపెనీ ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఎస్సై అబ్దుల్‌ నబీ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన కేశబోయిన సతీష్‌బాబు 2018లో పిఠాపురంలో సిరి ఎంటర్‌ప్రైజస్‌ పేరుతో ఒక కంపెనీ ఏర్పాటు చేశాడు. నెలకు రూ.500 చొప్పున 20 నెలల పాటు (రూ.పదివేలు) చెల్లిస్తే ప్రతి నెలా లక్కీడ్రా తీసి దానికి రెట్టింపు విలువైన గృహోపకరణాలు ఇస్తామంటూ నమ్మబలికాడు. దీంతో పిఠాపురం దాని పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రూ.పదివేలు చొప్పున చెల్లించారు. నెలలు గడుస్తున్నా ఏవిధమైన గిఫ్ట్‌లు ఇవ్వక పోవడంతో అనుమానం వచ్చి గురువారం రాత్రి ఆ కంపెనీకి చెందిన రిప్రజెంటేటివ్‌ రాహుల్‌ను పట్టుకున్నారు. తాము మోసపోయినట్టు గ్రహించి సదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఉదయం నుంచి పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద బారులు తీరారు. పోలీసులు ఆ కంపెనీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు