వివాహ విందు ఏర్పాటు చేసిన వ్యక్తి అరెస్ట్‌

24 Mar, 2020 04:38 IST|Sakshi

కరోనా నిబంధనలు అతిక్రమించిన నేపథ్యంలో చర్యలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఘటన

జంగారెడ్డిగూడెం రూరల్‌: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేటలో వివాహ భోజనాలు ఏర్పాటు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తమ్ముడి  వివాహం అనంతరం తన ఇంట్లో ఆకుల సుధాకర్‌ సోమవారం పెద్దఎత్తున భోజన ఏర్పాట్లు చేశాడు.

కరోనా ప్రభావం వల్ల ఐదుగురికి మాత్రమే భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని, అంతకుమించి ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ నెల 22న పంచాయతీ కార్యదర్శి అతనికి నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి భోజనాలు ఏర్పాటు చేయడంతో సుధాకర్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ చెప్పారు. ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు, 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఎటువంటి ఫంక్షన్లు, ఉత్సవాలు, జాతరలు నిర్వహించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు