రైలు నుంచి దూకిన దంపతులు

17 Sep, 2018 05:48 IST|Sakshi
చికిత్స పొందుతున్న పింకీ, బికాస్‌

రైల్లో తమను యువకులు వేధించారంటున్న బాధితులు 

ఏలూరు టౌన్‌: ఆకతాయిల లైంగిక వేధింపులు తాళలేక భయాందోళనకు గురైన దంపతులు కదులుతున్న రైలు నుంచి దూకడంతో భర్తకు స్వల్ప గాయం కాగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని ఆలీపూర్‌ జిల్లా జయగామ్‌ గ్రామానికి చెందిన బికాస్‌ రాయ్, పింకీ రాయ్‌ దంపతులు. రెండేళ్లుగా వారిద్దరూ తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఒక ప్రైవేట్‌ ప్లాస్టిక్‌ పైపుల కంపెనీలో పనిచేస్తున్నారు.

పింకీ రాయ్‌ గర్భిణి కావటంతో వారు స్వగ్రామం వెళ్ళేందుకు సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్‌–గౌహతి వెళ్లే రైలు జనరల్‌ బోగీలో ఆదివారం ఉదయం ఎక్కారు.  అదే బోగీలో ప్రయాణిస్తున్న బీహార్‌కు చెందిన కొందరు యువకులు వీరిద్దరినీ వేధించడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు రైలు ఏలూరులోని పవర్‌పేట రైల్వేస్టేషన్‌లో  మెల్లగా వెళ్తూ ఉండగా బాధితులు దిగేందుకు యత్నించారు. ఈ దశలో బికాస్‌ దిగుతుండగా, పింకీని యువకులు నెట్టి వేసినట్లు బికాస్‌ పోలీసులకు చెప్పాడు.  కాగా ఆకతాయిలను రైల్వే పోలీసులు విశాఖలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు