పిలిస్తే పలకలేదన్న కోపంతో.. 

28 Nov, 2019 03:07 IST|Sakshi
మృతురాలు రూత్‌ జార్జ్‌, నిందితుడు డొనాల్డ్‌ తుర్మాన్‌

అమెరికాలో హైదరాబాద్‌ యువతిని హతమార్చిన దుండగుడు

వాషింగ్టన్‌: అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన యువతి రూత్‌ జార్జ్‌ (19) తనతో మాట్లాడేందుకు నిరాకరించడం లేదా తాను పిలిస్తే స్పందించలేదనే కోపంతో నిందితుడు డొనాల్డ్‌ తుర్మాన్‌ చంపేసి ఉండొచ్చని ప్రాసిక్యూటర్‌ తెలిపారు. మాట్లాడలేదనే కోపంతోనే గొంతు నులిమి హత్య చేశాడని వివరించారు. మంగళవారం తుర్మాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా కుక్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ జేమ్స్‌ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి జార్జ్‌ పార్కుకు నడుచుకుంటూ వెళ్తుండగా తుర్మన్‌ పిలవగా పలకలేదని.. కారు గ్యారేజీలోకి వెళ్తున్న జార్జ్‌ను వెంబడించాడని చెప్పారు.

ఆమె చాలా అందంగా ఉందని, తనతో మాట్లాడాలని భావించాడని, అయితే ఆమె స్పందించలేదని వివరించారు. దీంతో కోపోద్రిక్తుడై గొంతు నులిమాడని, దీంతో అచేతనా స్థితిలోకి వెళ్లిందని చెప్పారు. ఆమెను తన కారు వెనుక సీటులోకి ఎక్కించి అత్యాచారం చేశాడని వివరించారు. తుర్మన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని, కస్టడీలోకి తీసుకోవాలని వాదనలు విన్న జడ్జి చార్లెస్‌ బీచ్‌–2 ఉత్తర్వులు ఇచ్చారు. ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్లు జైలు శిక్ష పడ్డ తుర్మన్‌ రెండేళ్లు జైలులో ఉండి గతేడాది డిసెంబర్‌లో బెయిల్‌పై బయటికి వచ్చాడు. రూత్‌జార్జ్‌ షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌లో ఆనర్స్‌ రెండో సంవత్సరం చదువుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది.  
 

మరిన్ని వార్తలు