నన్ను చంపేందుకు కుట్ర

20 Mar, 2019 12:09 IST|Sakshi

తండ్రిపై పోలీసులకు యువతి ఫిర్యాదు

రసూల్‌పురా: తన తండ్రి రెండో వివాహం చేసుకుని తన చంపేందుకు యత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి బొల్లారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న డేవిడ్‌  రాణిగండ్‌ ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతని కుమార్తె అమూల్య (26) అలియాస్‌ ఆసియా తొమ్మిదేళ్ల క్రితం చంపాపేట సింగరేణి కాలనీకి చెందిన ఇస్మాయిల్‌ను ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. తొమ్మిది నెలల క్రితం తన తల్లి మృతి చెందినట్లు తెలియడంతో పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా  తండ్రి, కుమార్తె మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం డేవిడ్‌ మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

ఆస్తి అడిగినందుకు తన తండ్రి డేవిడ్‌ రెండో భార్యతో కలిసి దాడి చేశాడని గత అక్టోబర్‌ 2న అమూల్య బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన  పోలీసులు డేవిడ్‌ అతని భార్యపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయగా కోర్టులో కేసు నడుస్తోంది. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి  చేయడమేగాకుండా,  తన ను హత్య చేసేందుకు డేవిడ్‌ సుపారీ ఇచ్చాడని ఆరోపిస్తూ అమూల్య మూడు రోజుల క్రితం బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించింది.  

కోర్టులో తేల్చుకోవాలి: సీఐ
తన తల్లికి సంబందించిన వస్తువులతో పాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని అమూల్య మూడు రోజుల క్రితం ఫిర్యాదులో పేర్కొందని సీఐ రమేష్‌రెడ్డి తెలిపారు. ఆస్తికి సంబందించిన ఫిర్యాదు అయినందున సివిల్‌ కేసుగా పరిగణిస్తూ కోర్టులో తేల్చుకోవాలని వారికి సూచించినట్లు సీఐ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు