తండ్రిని కడతేర్చిన కుమార్తె

25 Aug, 2018 11:52 IST|Sakshi
షేక్‌బాబుబాషా (ఫైల్‌)

వేధింపులు భరించలేక బండరాయితో మోది హత్య

పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు తానే హత్య చేశానని ఒప్పుకోలు

పుంగనూరు: చెడు అలవాట్లకు బానిసై, వేధిస్తున్న కన్నతండ్రిని కుమార్తె బండరాయితో కొట్టి చంపిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులోని మేలుపట్లలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మేలుపట్లలో షేక్‌బాబుబాషా (48)కు కుమార్తె నగీన, కుమారుడు సిద్దిక్‌ ఉన్నారు. నగీన టీటీసీ చదువుతోంది. కుమారుడు ఆరో తరగతి చదువుతున్నాడు. మద్యానికి బానిసైన షేక్‌బాబుబాషా మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేవాడు. కుటుంబ సభ్యులను కొట్టడం, ఇంట్లో వస్తువులు అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగేవాడు.

పలుమార్లు చెప్పిన బాబుబాషా ప్రవర్తనలో మార్పు రాలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో తీవ్రంగా గొడవపడ్డాడు. విసిగిపోయిన నగీన ఇంటి ముందు నిద్రిస్తున్న తండ్రి తలపై పెద్ద బండరాయితో మోదింది. బాబూబాషా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సీఐ సాయినాథ్, ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు