‘టీచర్‌ కూడా పట్టించుకోలేదు.. చనిపోదామనుకున్నా’

7 Aug, 2018 16:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ఓ మైనర్‌ బాలుడిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ముగ్గురు మైనర్లపై ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పొక్సో చట్టం)  కింద కేసు నమోదయ్యింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీలో నాల్గో తరగతి చదువుతున్న ఒక మైనర్‌ బాలుడిని.. అదే పాఠశాలలో చదువుతున్న మరో ముగ్గురు మైనర్‌ విద్యార్థులు స్కూల్‌ బస్సులో లైంగిక వేధింపులకు గురి చేశారు.

అయితే బాధిత బాలుడు ఈ విషయం గురించి ఓసారి ఉపాధ్యాయుడికి కూడా ఫిర్యాదు చేశాడు. కానీ ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో బాలున్ని వేధింపులకు గురి చేస్తున్న మిగతా విద్యార్ధులు మరింత రెచ్చిపోయారు. అప్పటికే పలుమార్లు బాలున్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. వారి చేష్టలతో విసిగిపోయిన బాలుడు ఆత్మాహత్యాయత్నం చేశాడు. సమాయానికి తల్లిదండ్రులు చూడటంతో ఆ పసివాన్ని కాపాడారు.

అనంతరం తల్లిదండ్రులు బాలున్ని సముదాయించి ఏం జరిగిందని అడగ్గా.. పాఠశాలలో, మిగతా విద్యార్ధులు తనతో ప్రవర్తిస్తోన్న తీరు గురించి చెప్పాడు. టీచర్లకు చెప్పినా వారు ఎటువంటి చర్య తీసుకోవడం లేదని వాపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి, తమ కొడుకును వేధించిన విద్యార్ధులపై ఫిర్యాదు చేశారు. పొక్సో యాక్ట్‌ కింద ముగ్గురు బాలుర మీద కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు