రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు

3 Sep, 2019 20:38 IST|Sakshi
వాహనదారుడు దినేష్‌ మదన్‌

సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు  రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌, గుజరాత్‌)  మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్‌, డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్‌ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే.  

దినేష్ మదన్‌ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్‌ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.  ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్‌ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్‌ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్‌ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్‌ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్‌లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా  చూసి షాకయ్యానంటున్నాడు దినేష్‌. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్‌ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని  తెలిపాడు.

అయితే రూల్‌ ఈజ్‌ రూల్‌ అంటున్నారు అధికారులు.  లైసెన్స్ లేని డ్రైవింగ్‌, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్  లేని డ్రైవింగ్‌... ఈ  నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. 

చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్‌లే!

మరిన్ని వార్తలు