భార్యా, పిల్లల్ని ఊరికి పంపి..

2 Feb, 2019 13:23 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న నరసింహ, రోధిస్తున్న భార్య సుహాసిని, పక్కన కుమారులు

డ్రైవర్‌ ఆత్మహత్య

వైఎస్‌ఆర్‌ జిల్లా ,ప్రొద్దుటూరు క్రైం :స్థానిక గీతాశ్రమం వీధిలోని చౌడేశ్వరి ఆలయం సమీపంలో పామిలేటి నరసింహ (36) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో భార్యా, పిల్లలు లేని సమయంలో అతను దూలం కొక్కికి చీర చుట్టుకొని ఉరి వేసుకున్నాడు. సమాచారం తెలియడంతో త్రీ టౌన్‌ ఎస్‌ఐ నరసయ్య సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నరసింహ కారు డ్రైవర్‌గా వెళ్తుంటాడు.అతనికి ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన సుహాసినితో 8 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి రేవంత్, నిఖ్‌లేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు గీతాంజలి హైస్కూల్‌లో చదువుకుంటున్నారు. నరసింహ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు.

పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని నిత్యం భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. నిత్యం అతను భార్యతో గొడవ పడేవాడు. గురువారం సాయంత్రం భార్యతో గొడవ పడ్డాడు. అహోబిళానికి వెళ్లాలని, పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకొని రమ్మని భార్యను పంపించాడు. అతని వేధింపులను భరించలేని ఆమె పిల్లలను తీసుకొని చౌడూరుకు వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్థానికులు ఆమెకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె హుటాహుటినా ఇంటికి రాగా నరసింహ ఉరికి వేలాడుతున్నాడు. పసి పిల్లలను వదిలేసి వెళ్లావా.. వీరిని ఎలా పెంచాలి దేవుడా అంటూ ఆమె విలపించసాగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు