మైనర్‌ పెళ్లికి నిరాకరణ.. కుటుంబం హత్య

3 Apr, 2018 11:14 IST|Sakshi

జంషెడ్‌పూర్‌ : ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌లోని వెస్ట్‌ సింగ్‌ భూమ్‌ జిల్లాలో గత నెల 14న ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సింగ్‌భూమ్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఐదు శవాలు దొరికాయి. వీరిని రామ్‌సింగ్‌ సిర్కా, అతని భార్య పను, కూతురు రంభ(17), కుమారులు కండే(12), సోన్యాలుగా పోలీసులు గుర్తించారు. ఇదివరకే పెళ్లైన వ్యక్తితో తన మైనర్‌ కూతురికి వివాహం జరిపించడానికి నిరాకరించాడనే కారణంతో రామ్‌ సింగ్‌ కుటుంబాన్ని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

రామ్‌సింగ్‌ ఇంట్లో లేని సమయంలో రాడ్లు, పదునైన ఆయుధాలతో కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులు.. వారి శవాలను ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో పడేశారని వివరించారు. రామ్‌ సింగ్‌ ఇంటికి రాగానే అతనిపై కూడా దాడి చేసి హతమార్చారని వెల్లడించారు. అతని శవాన్ని కూడా దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ కేసులో తొమ్మిది మందిని అనుమానితులుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఒకరిని అరెస్టు చేయగా మిగిలిన వారు రాష్ట్రం విడిచి పారిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు