కన్నకూతుళ్లపై అత్యాచారం

25 Aug, 2018 08:05 IST|Sakshi
రాజ్‌బహదూర్‌

కొంతకాలంగా సాగుతున్న దారుణం

పోలీసులకు తల్లీకూతుళ్ల ఫిర్యాదు

నిందితుడిపై నిర్భయ కేసు నమోదు

శంషాబాద్‌: కన్నకూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కామాంధుడిలా మారాడు. కూతుళ్లను బెదిరిస్తూ కొంతకాలంగా అత్యాచారానికి ఒడిగడుతున్న అతడి దారుణాలను భరించలేక తల్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్‌ దేశానికి చెందిన రాజ్‌బహూదూర్‌ (60)ఉపాధి కోసం తన భార్య ఐదుగురు సంతానంతో ఐదేళ్ల కిందట బిహార్‌ రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడ కొంతకాలం పనిచేసిన అతడు కుటుంబంతో కలిసి రెండేళ్ల కిందట హైదరాబాద్‌లోని టోలిచౌకికి మకాం మార్చాడు. పెద్ద కుమార్తె (14) రెండో కుమార్తె (12)ను బెదిరించి వారిపై అత్యాచారానికి ఒడిగడుతుండడంతో విషయం తెలుసుకున్న తల్లితో పాటు వారి బంధువులు అతడిని మందలించి అక్కడి నుంచి బిహార్‌కు పంపారు.

ఐదు నెలల కిందట శంషాబాద్‌కు వచ్చిన రాజ్‌బహూదూర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి తాను సత్ప్రవర్తనతో ఉంటానని నమ్మబలికాడు. స్థానికంగా రైల్వేకమాన్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందులోనే నివాసముంటున్నారు. ఇటీవల రాజ్‌బహదూర్‌ తరచుగా కూతుళ్లతో అదే తీరుగా ప్రవర్తిస్తుండడంతో విసిగిపోయిన తల్లీకూతుళ్లు నాలుగురోజుల కిందట ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌బహదూర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. బాలికలను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు