కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

30 Nov, 2019 09:10 IST|Sakshi

సాక్షి, నంద్యాల: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కాలయముడయ్యాడు. కుమారుడు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లడంతో భార్య, బంధువులను అక్కడికి పంపించి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఈ ఘటన బనగానపల్లె మండలం పల్లెజిల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కథనం మేరకు.. పల్లెజిల్లెల్ల గ్రామానికి చెందిన వ్యక్తికి కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె నంద్యాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కుమారుడు పదిరోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతూ నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి తోడుగా తల్లి ఆసుపత్రిలోనే ఉంది.

ఇదే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెపై తండ్రి రెండు రోజుల పాటు బలవంతంగా అత్యాచారం చేశాడు. కాగా.. తనకు కడుపునొప్పి వస్తోందని బాధితురాలు తల్లికి ఫోన్‌లో చెప్పడంతో ఆసుపత్రిలో చూపించుకుందువురా అని నంద్యాలకు పిలిపించింది. ఇప్పుడు ఎందుకు కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు ఉన్నాయని ఆరోగ్య పరీక్షల సమయంలో గట్టిగా అడిగింది.  ‘నిజం చెబితే బాగుండదమ్మా.. చెప్పలేనం’టూ కన్నీరు పెట్టుకుంది. తల్లి రెట్టించి అడగడంతో రెండు రోజులుగా తన తండ్రి చేసిన అఘాయిత్యం గురించి వివరించింది. ఈ విషయం విని షాక్‌కు గురైన ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు