ఆరుగంటల్లో.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

6 May, 2018 21:16 IST|Sakshi

షోఫియాన్‌: జమ్మూ-కశ్మీర్‌లోని షోఫియాన్‌ జిల్లా బడిగాం వద్ద ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ఐదుమంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. బడిగాంలోని ఇమాన్‌ సాహిబ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ‘ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని వారిపై కాల్పులు జరిపారు. దీనికి భారతసైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. హతులను హిజ్యుల్‌ ముజాహిద్దీన్‌ ముఠాకు చెందిన వారిగా గుర్తించారు. కశ్మీర్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కూడా ఈ కాల్పుల్లో మరణించారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఐదుగురు పౌరులు కూడా మరణించారు.’ అని ఓ అధికారి తెలిపారు. 

ఈ ఆపరేషన్‌ విజవంతం చేసిన దళాలను అభినందిస్తూ జమ్మూ-కశ్మీరు డీజీపీ శేష్ పాల్ వైద్ ట్వీట్‌ చేశారు. ‘ షోఫియాన్‌ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను అంతం చేశాం. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ-కశ్మీరు పోలీసులు చేసిన కృషికి అభినందనలు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కానీ, ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందడంతో దక్షిణ కశ్మీర్‌లో పలు చోట్ల ఘర్షణలు చెలరేగాయి. ముఖ్యంగా షోఫియాన్‌, పుల్వామా, తదితర దక్షిణ కశ్మీర్‌ ప్రాంతంలో పౌరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. భద్రతా దళాలను నిరోధించేందుకు స్థానికులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. దీంతో అదనపు సీఆర్‌పీఎఫ్ బలగాలను ఈ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వార్తలు