ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే...

3 Oct, 2018 06:56 IST|Sakshi
ఆస్పత్రి వద్ద సంధ్య కుటుంబీకుల రాస్తారోకో దృశ్యం,  (ఇన్‌సెట్‌) సంధ్య మృతదేహం (ఫైల్‌)

‘వేధింపులు, బెదిరింపులతోనే యువతి ఆత్మహత్య’

సాక్ష, ఇల్లెందు(ఖమ్మం): పట్టణంలోని నెంబర్‌–2 బస్తీకి చెందిన ఎం.సంధ్య(19) ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆమె సోమవారం మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పి భరించలేకనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నదంటూ అదే రోజు రాత్రి తండ్రి శ్రీనివాస గౌడ్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత, తన కుమార్తె ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులు, బెదిరింపులే కారణమంటూ మరోసారి ఫిర్యాదు చేశాడు.

మంగళవారం ఉదయం పోస్టుమార్టం అనంతరం, ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ప్రధాన రహదారిపై ఆమె కుటుంబీకులు బైఠాయించారు. ఇల్లెందు పట్టణంలోని నెంబర్‌–2 బస్తీకి చెందిన సిద్ధూ అనే యువకుడి వేధింపులు, ప్రేమ పేరుతో బెదిరింపుల కారణంగానే సంధ్య ప్రాణం తీసుకుందని ఆరోపించారు. ఆమె తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు