వరుసగా ఎదురుదెబ్బలు

3 Mar, 2018 03:27 IST|Sakshi

మల్కన్‌గిరి తర్వాత సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కొన్నేళ్లుగా వరుసగా జరిగిన ఎన్‌కౌంటర్లతో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీకి తాజా ఎన్‌కౌంటర్‌ శరాఘాతంలా పరిణమించింది. ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు ఏడాదిన్నర కింద దేశంలోనే భారీ ఎన్‌కౌంటర్‌ అయిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ జరిగింది. అందులో 26 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీగా మారకముందు, తర్వాత కూడా జరిగిన ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 

1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది పీపుల్స్‌వార్‌ సభ్యులు చనిపోయారు. ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైన వారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతానికి వాహనాల్లో తీసుకెళుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్‌ ప్లీనరీపై పోలీసులు దాడి చేసిన ఎన్‌కౌంటర్‌లో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులున్నారు.

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్‌కౌంటర్‌ జరిగిన నల్లమల ఘటనలో 11 మంది మరణించారు. వరంగల్‌ జిల్లా కౌకొండ ఘటనలో సుధాకర్‌ సహా 9 మంది, కరీంనగర్‌ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 12 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్‌ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్‌తోపాటు 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, నేరెళ్ల పద్మక్క ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు.. ఇలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఇవేగాకుండా ఇద్దరి నుంచి ఐదారుగురి వరకు మావోయిస్టులు, ముఖ్య నాయకులు మృతిచెందిన ఎన్‌కౌంటర్లు ఎన్నో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు