పెళ్లాం వద్దు.. ప్రియురాలే ముద్దు

8 Feb, 2018 10:25 IST|Sakshi

తేల్చి చెప్పిన భర్త

పోలీస్‌స్టేషన్‌ ముందు భార్య ఆత్మహత్యాయత్నం

తాడేపల్లి(తాడేపల్లి రూరల్‌):  ప్రియురాలే ముద్దు.. నువ్వు వద్దు అంటూ  భార్యను ఓ కీచక భర్త చిత్రహింసలు పెట్టడంతో తాళలేక బుధవారం రాత్రి భార్య తాడేపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు భర్తను పిలిపించి భార్యాభర్తలు ఇద్దరకూ కౌన్సిలింగ్‌ ఇస్తుండగానే భార్య నాకు వద్దు, ప్రియురాలే నాకు కావాలని ఆ భర్త తేల్చి చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన భార్య స్టేషన్‌లో నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి రోడ్డుపై వస్తున్న ఓ లారీ కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే..

మహానాడు ప్రాంతంలో నివాసం ఉండే కరీముల్లాకు నసీమా అనే యువతితో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. విజయవాడలో నివాసం ఉండే ఓ యువతి మహానాడు ప్రాంతంలో నివాసం ఉండేందుకు వచ్చింది. ఇదే సమయంలో కరీముల్లాకు ఆ యువతితో పరిచయం ఏర్పాడింది. అనంతరం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి భార్య నసీమాను కరీముల్లా వేధించడం ప్రారంభించాడు. ఎన్నిసార్లు పెద్దలు సర్ది చెప్పినా కరీముల్లా ప్రవర్తనలో మార్పు రాలేదు. చివరకు భార్య పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల ముందు కూడా చులకన చేసి మాట్లాడటంతో  మనస్తాపం చెంది భార్య ఆత్మహత్యయత్నం చేసింది. చివరకు పోలీసులు గుంటూరు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు పంపేందుకు సన్నాహాలు చేశారు.

మరిన్ని వార్తలు