హైదరాబాద్‌లో అమానుషం.. తల్లి కళ్ల ముందే

7 Nov, 2018 11:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పిల్లలకు చిన్నదెబ్బ తగిలితేనే తల్లి ప్రాణం విలవిల్లాడిపోతుంది. అలాంటిది తన కళ్లముందే తన బిడ్డలు మంటల్లో కాలి పోతుంటే.. ఆ మాతృమూర్తి కడుపుకోత వర్ణణాతీతం. తన కళ్ల ముందే కాలి బూడిదయిపోతున్న బిడ్డల్ని కాపుడుకోలేక.. సాయం చేసేవారు రాక.. నిస్సహయంగా చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ తల్లి కుక్కను చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తోంది. మానవత్వం లేని ఆ రాక్షసులను కసితారా తిట్టాలనిపిస్తుంది. విచక్షణ మరిచిన వారేవరో తమ రాక్షసానందం కోసం నాలుగు చిన్న కుక్కపిల్లలను మంటల్లో పడేసి సజీవ దహనం చేసిన దారుణమైన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

పాపం వాటి తల్లి ముందే ఆ చిన్న పప్పీలను మంటల్లో పడేశారు. బిడ్డలు కళ్ల ముందే కాలిపోతుంటే రక్షించుకోలేక నిస్సహయంగా చూస్తూ ఏడుస్తూ ఉన్న కుక్కకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అయ్యింది. ఈ దారుణానికి ఒడిగట్టిందేవరో.. అసలు ఏ ఉద్దేశంతో ఇంతటి అమానవీయ సంఘటనకు పాల్పడ్డారో తేలీదు. కుక్కప్లిలలు మంటల్లో కాలిపోతున్న వీడియో.. ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇది గమనించిన స్థానికులు ఈ దారుణం గురించి ఆ ప్రాంతంలో ఉండే ఓ జంతు ప్రేమికుడికి సమాచారం ఇచ్చారు.

సదరు వ్యక్తి సంఘటన స్థలానికి చేరేలోపే నాలుగు కుక్కపిల్లలో మూడు మంటల్లో కాలి మరణించగా ఒకటి కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతోంది. ఇది గమనించిన సదరు వ్యక్తి వైద్యం నిమిత్తం ఆ పప్పిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ సాయంత్రానికి అది కూడా మరణించింది. జరిగిన దారుణం గురించి ‘పీపుల్స్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొటెక్టర్‌’ కార్యకర్త ఒకరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ దారుణం చోటుచేసుకున్న ప్రాంతానికి సంబంధించిన సీసీ టీవీ ఫూటేజిని పరిశీలిస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం 2016, జులైలో కొంతమంది యువకులు కొన్ని కుక్కపిల్లలని మంటల్లో పడేసి సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు