ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం

15 Nov, 2023 09:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది.

ప్రదీప్‌రెడ్డితో పాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్‌సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్‌ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు.

అమీన్‌పూర్‌ మండల పరిధిలోని పటేల్‌ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్‌ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్‌ జవాన్‌లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు.

కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 
చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు?

మరిన్ని వార్తలు