రక్తమోడుతున్న రైలు పట్టాలు

25 Aug, 2018 14:31 IST|Sakshi
ఇటీవల వరంగల్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు(ఫైల్‌)

జనవరి నుంచి ఇప్పటివరకు 38 మంది మృతి

ఈ మూడు నెలల్లోనే 24 మంది

వరంగల్‌ నుంచి తాళ్లపూసపల్లి వరకు సూసైడ్‌ స్పాట్‌లు..

ఆత్మహత్యల నివారణలో ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసుల నిర్లక్ష్యం

పనిచేయని సీసీ కెమెరాలురైల్వేగేట్‌

కాజీపేట రూరల్‌ : రైలు పట్టాలు రక్తమో డుతున్నాయి. ఆత్మహత్యలకు అడ్డాలుగా మారు తున్నాయి. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల జీఆర్‌పీ పరిధులు సూసైడ్‌ స్పాట్‌లుగా మారుతు న్నాయి. ఉమ్మడి జిల్లాలో వరంగల్‌  నుంచి తాళ్లపూసపల్లి మధ్యలో నిత్యం ఎవరో ఒకరు మృత్యు వాత పడుతున్న సంఘటనలున్నాయి. ఇక కొన్ని ప్రమాదాలైతే వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లకు అరకిలో మీటరు దూరంలోపే జరుగుతుండడం విశేషం.

తాజాగా గురువారం మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం వెంగంపేట గ్రామానికి చెందిన హమాలీ కార్మికుడు గట్ల శాంతయ్య(50) స్టేషన్‌ మూడో నెంబర్‌ ప్లాట్‌ ఫాంలోని పట్టపగలు హైటెన్షన్‌ పోల్‌ ఎక్కి వైర్లు ముట్టుకుని అందరూ చూస్తుండగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే. అలాగే ఇదే రోజు అండర్‌ బ్రిడ్జిపైన ఓ వృద్ధురాలు (60) ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు ఘటనలు సుమారు కిలో మీటర్‌ లోపలే జరగడం సంచలనం రేపుతుంది.

ఇంత జరుగుతున్నా సంబంధిత ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు ఆత్మహత్యలను నివారించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. వరంగల్‌ పరిధిలో..
నగరంలోని వరంగల్‌ రైల్వే స్టేషన్‌ జీఆర్‌పీ పరిధి ఇటు కాజీపేట దర్గా, అటు తాళ్లపూసపల్లి వరకు ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా వరంగల్‌ రైల్వే మినీ బ్రిడ్జి(సంతోషిమాతగుడి వద్ద), వరంగల్‌ చింతల్‌ ఆర్వోబీ, ధర్మారం గేట్, హంటర్‌రోడ్‌ ఆర్వోబీ, గూడ్స్‌షెడ్, రైల్వేగేట్, బొందివాగు, దర్గాగేట్‌ మొదలైన ప్రాంతాలు ఆత్మహత్యల స్పాట్లుగా ఉన్నాయి. అంతే కాకుండా వరంగల్‌ రైల్వేస్టేషన్‌ కూడా ఇందులో ఉంది.

కాజీపేట పరిధిలో..

కాజీపేట జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి కాజీపేట, కాజీపేట టౌన్, హసన్‌పర్తి, ఉప్పల్, పెండ్యాల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఇప్పగూడ, రఘునాథపల్లి, యశ్వంత్‌పూర్, జనగాం, పెంబర్తి వస్తాయి. ఈ స్టేషన్‌ల పరిధిలో ఎక్కడ రైల్వేట్రాక్‌పై ఆత్మహత్యలు జరిగితే కాజీపేట జీఆర్‌పీ పోలీసులు దర్యాప్తు చేస్తారు.

పనిచేయనిసీసీ కెమెరాలు..

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో గతంలో 8 సీసీ కెమెరాలుండగా ఆ మధ్య మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 14 సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయం తెలిసింది. గురువారం ప్లాట్‌ఫాం-3లో శాంతయ్య అనే హమాలీ కార్మికుడు విద్యుత్‌పోల్‌ ఎక్కుతున్నపుడు సీసీ కెమెరాల ద్వారా గుర్తించే అవకాశం ఉంది.

కానీ వాటి నిర్వహణ సరిగా లేకపోవడం ఇక్కడ సమస్యగా మారింది. అలాగే ప్లాట్‌ ఫాంల మీద బందోబస్తు నిర్వహించే జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులైన శాంతయ్యను అడ్డుకుని ఉంటే ఒక ఆత్మహత్య చేసుకోకుండా ఉండేవాడని సాటి ప్రయాణికులు అనడం వినిపించింది. అప్పుడు పోలీసులు ఏంచేశారనేది ప్రశ్నార్థకం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆత్మహత్యల నివారణకు కావల్సిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

జనవరి నుంచి ఇప్పటివరకు..

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో గత జనవరి నుంచి మే నెల వరకు 14 మంది ఆత్మహత్య చేసుకోగా.. గత జూన్‌ నెల నుంచి ఈ ఆగస్టు ఈ మూడు నెలల్లో 24 మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం 38 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు సంబంధిత జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. ఎక్కువగా కేఎం 375 నుంచి 376ల మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వారు వివరించారు.  

మరిన్ని వార్తలు